గిడుగు వేంకట సీతాపతి (Gidugu Venkata Seetapati)

గిడుగు వేంకట సీతాపతి

గిడుగు వెంకట సీతాపతి గారు ప్రసిద్ధ భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లల కోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది చిలకమ్మపెళ్ళి. ఈయన  28 జనవరి 1885 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో తెలుగు వ్యవహారిక భాషా ఉద్యమ సారధి అయిన గిడుగు రామమూర్తి దంపతులకు జన్మించారు. మద్రాసు కైస్తవ కళాశాలలో చరిత్రలో పట్టభద్రులై కొంతకాలం పర్లాకిమిడిలో చరిత్ర ఉపన్యాసకులుగా పనిచేశారు.  వ్యవహారిక భాషా ఉద్యమంలోనూ, సవర భాషా ఉద్యమంలోనూ తండ్రికి కుడిభుజంగా నిలిచారు.  రైతుబిడ్డ, స్వర్గసీమ, పల్నాటియుద్ధం, భక్తిమాల వంటి చలన చిత్రాల్లోనూ, కొన్ని నాటకాలలోను నటించారు.

          1945లో మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వముకు అనేక వ్యాసాలు రచించి విశేషంగా తోడ్పడ్డారు. 1949లో తెలుగు భాషా సమితి ఏర్పడినపుడు తెలుగు విజ్ఞాన సర్వస్వపు ప్రధాన సంగ్రాహకులుగా నియమితులయ్యారు. చరిత్ర-రాజనీతి సంపుటం సంపాదక వర్గంలో ప్రముఖపాత్ర వహించారు. సూర్యరాయాంధ్ర నిఘంటువుకు చివరిదశలో వీరు గౌరవ సంపాదకులుగా పనిచేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ సంకలితం చేసిన భారతీయ గ్రంథసూచిలో తెలుగు విభాగానికి వీరు సంపాదకత్వం వహించారు.  వీరు రచించిన తెలుగు కావ్యాలలో ముఖ్యమైనవి ‘భారతీ శతకము’, ‘సరస్వతీ విలాసము’, ‘కొద్ది మొర్ర’, ‘బాలానందము’ విశేష ప్రజాదరణ పొందాయి. వీరు బైబిల్ లోని మూడు సువార్తలను సవర భాషలోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి అభ్యర్ధనపై తెలుగు సాహిత్య చరిత్రను ఇంగ్లీషులోకి అనువదించారు. వీరు రచించిన ‘తెలుగులో ఛందోరీతులు’ అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

          వీరి కుటుంబం ఆంధ్రాభిమానానికి ప్రసిద్ధికెక్కింది. పర్లాకిమిడి తాలూకాను ఒడిషా రాష్ట్రంలో చేర్చడానికి జరిగిన ప్రయత్నాన్ని వీరు, వీరి తండ్రి రామమూర్తి తీవ్రంగా ప్రతిఘటించారు. తెలుగువారి పక్షాన వాదించడానికి 1933లో వీరు లండన్ వెళ్ళి శామ్యూల్ హోర్ మొదలైన వారి ఎదుట యుక్తిగా వాదించారు. అయినా 1936లో పర్లాకిమిడి తాలూకా ఒడిషా రాష్ట్రంలో భాగంగా ఏర్పడింది.   తండ్రి అనంతరం రాజమండ్రి చేరిన సీతాపతి రాజకీయాలలో పాల్గొని జిల్లా బోర్డు, మునిసిపల్ కౌన్సిల్, సెనేట్ మొదలగు సంస్థలలో సభ్యులుగాను, అధ్యక్షులుగాను పనిచేశారు.  వీరికి ఆంధ్ర విశ్వకళాపరిషత్ కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. వీరి ఇంగ్లీషు రచనలలోని విశిష్టతను గుర్తించి వాషింగ్టన్ లోని అంతర్జాతీయ అకాడమీ వీరికి డి.లిట్. గౌరవం ఇచ్చింది.  వీరు ఏప్రిల్ 19, 1969లో హైదరాబాదులో పరమపదించారు.